సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం | Sai Krishna Case: Petition To Include Dgp And Vijayawada Cp As Accused | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం

Jul 21 2026 12:21 PM | Updated on Jul 21 2026 1:21 PM

Sai Krishna Case: Petition To Include Dgp And Vijayawada Cp As Accused

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్‌.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబును ఏ–2గా, విజయవాడ సౌత్‌జోన్‌ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్‌లో ప్రస్తావించారు.

టాస్క్‌ఫోర్స్‌ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్‌కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్‌ రిపోర్టులో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జూన్‌ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్‌ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్‌ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్‌కు ఈ–మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్‌ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్‌లో ఆరోపించారు.

పోలీస్‌స్టేషన్‌ సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్‌లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్‌ఫోన్‌తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్‌ పేర్కొన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ నివేదికలు, డైలీ స్టేటస్‌ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్‌లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం

సిట్‌ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్‌.. డీజీపీ, కమిషనర్‌, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్‌ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్‌ వాదన. పోలీస్‌ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్‌లో  ఫిర్యాదుదారు ఉదహరించారు.

ప్రస్తుతం జరుగుతున్న సిట్‌ దర్యాప్తుతోపాటు ప్రైవేట్‌ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్‌ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్‌, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement