మందుల్లేవు.. మాస్కుల్లేవు.. | Chandrababu government negligent on Corona | Sakshi
Sakshi News home page

మందుల్లేవు.. మాస్కుల్లేవు..

Jul 21 2026 6:18 AM | Updated on Jul 21 2026 6:18 AM

Chandrababu government negligent on Corona

కరోనా కాటేస్తున్నా చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం 

వైరస్‌ బారినపడి ఇప్పటికే నలుగురు మృతి.. మరణాల రేటు 20 శాతం 

వైరస్‌ నియంత్రణ, ముందస్తు జాగ్రత్తలు పట్టని బాబు ప్రభుత్వం 

ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు లేవు.. ఎన్‌95 మాస్క్ లూ లేవు 

లక్షణాలున్న వారికి పరీక్షలూ అంతంత మాత్రమే

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతోపాటు మరణాలూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేసుల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నా, చంద్రబాబు  ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యం పట్ల అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, వైద్య పరీక్షల నిర్వహణ, బాధితులకు మెరుగైన వైద్య సేవల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆస్పత్రుల్లో కనీస సన్నద్ధత లేకుండాపోయింది. గత నెలలో వైఎస్సార్‌ కడప జిల్లాలో పాజిటివ్‌ కేసుల నమోదు, బా«ధితుల మృతి ఘటనలను వైద్య శాఖ తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని మీడియా బటయపెట్టడంతో ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. 

పరీక్ష కేంద్రాలెక్కడ? 
దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ జబ్బుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని దురదృష్టకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎక్కడా కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. బాధితులు తీవ్ర అనారోగ్యంపాలై ఐసీయూ, వెంటిలేటర్‌పై చికిత్స చేయాల్సిన సందర్భాల్లో మెడికల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం మాత్రమే కోవిడ్, ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్పటికే బాధితుల ఆరోగ్యం విషమించి వైరస్‌ కబళిస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోగా, రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు బయటకు రాకుండా కప్పెట్టింది.

అయితే, కరోనా మరణాలు, వైరస్‌ వ్యాప్తి మీడియాలో రావడంతో హడావుడిగా వార్డులు, ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశామని వైద్య శాఖ ప్రకటించింది. అదీ పెద్దాస్పత్రుల్లో మాత్రమే. అంతకు మించి మరే సన్నద్ధతా లేదు. వైరస్‌ వ్యాపించకుండా కనీస చర్యలు లేవు. కోవిడ్‌ రోగులకు చికిత్సలో అవసరమయ్యే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ కనీస నిల్వలు కూడా ఆస్పత్రుల్లో లేవని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గతంలో కొన్న ఇంజెక్షన్లకు గతేడాది డిసెంబర్‌తో కాలం చెల్లినట్టు సమాచారం. 

వైరస్‌ సోకి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారికి ప్రాణాధారమైన ఈ ఇంజెక్షన్‌ కనీస నిల్వలను అందుబాటులో ఉంచాలనే సోయ, ముందస్తు జాగ్రత్త బాబు సర్కార్‌కు లేకుండా పోయింది. మరోవైపు వైరస్‌ బాధితులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బందికి ఎన్‌ 95 మాసు్కలు కూడా ఆస్పత్రుల్లో కనీస సంఖ్యలో లేవని సూపరింటెండెంట్‌లు ఫిర్యాదు చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి భయానికి తోడు, సీజనల్‌ వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. కరోనా బాధితులతో పాటు, సీజనల్‌ వ్యాధుల బాధితులకు చికిత్సల్లో అవసరమైన అత్యవసర మందులకూ ఆస్పత్రుల్లో తీవ్ర కటకట నెలకొంది. 

కరోనా కాలంలోనూ మరణాలు రేటు ఇంత లేదు 
గత నెల 26 నుంచి రాష్ట్రంలో దాదాపు 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్‌ సోకిన నలుగురు బాధితులు మరణించారు. అంటే 20 శాతం మరణాల రేటు నమోదైంది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఇంత భారీ మొత్తంలో మరణాల రేటు లేదని వైద్య శాఖ లెక్కలే చెబుతున్నాయి. ఒక్క వైఎస్సార్‌ కడప జిల్లాలోనే ఆరు పాటివ్‌ కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. కాకినాడ జిల్లాలో రెండు కేసులు రాగా ఒకరు ప్రాణాలు విడిచారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు ఇలా పలు జిల్లాల్లో అధికారికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏడుగురు ఆస్పత్రిలో, నలుగురు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement