విజయనగరం క్రైమ్: రెండోసారి కూడా ఆడపిల్లనే కంటాననే అనుమానంతో తనను అత్తింటివారు ఇంటినుంచి గెంటేశారంటూ గంట్యాడకు చెందిన గర్భిణి తులసి సోమవారం విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఈ ఘటనపై బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గంట్యాడ మండలంలోని కొటారుబిల్లికి చెందిన వ్యక్తితో గంట్యాడకు చెందిన తులసి ఇంటర్ చదువుతుండగానే ప్రేమలో పడింది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఫలితంగా తులసికి ఆడపిల్ల పుట్టింది. తులసి కన్నవారు బాధ్యతగా ఆమెకు ప్రేమించిన వ్యక్తితో రామతీర్థంలో పెళ్లి చేశారు. భర్త కిరాణా కొట్టులో పని చేస్తూ తన అమ్మ, అక్కలతో కలిసి ఉండేవాడు. ఇది ఇష్టం లేని తులసి,భర్తే దైవం అని భావించి ఆడపిల్ల పుట్టినా, తిరిగి తన కడుపులో మరో బిడ్డ్డను మోస్తుండడంతో సర్దుకుంది.
కానీ అత్తారింట్లో ఆరళ్లు ఎక్కువవడం దీనికి తోడు భర్త కూడా మళ్లీ ఆడపిల్ల పుడితే ఎవరుసాకుతారు..? అని అంటున్న మాటలు తులసిని బాధపెట్టాయి. రెండోసారి తులసి గర్భిణి అని తెలియడంతో రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలంటూ భర్త, అత్త, ఆడపడుచులు తులసిని వేధించసాగారు. గర్భిణి అయిన తులసి మెడలో తాళిని తెంచి డబ్బులు తెస్తేనే ఇంట్లోకి రావాలంటూ గెంటేశారు. తండ్రికి విషయం తెలిసి తులసిని చేరదీసి గ్రామస్తుల సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.


