● పర్యవేక్షించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
పూసపాటిరేగ:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. కలెక్టర్ రాంసుందరరెడ్డి ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ముందుగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ వేదిక ఏర్పాట్లు, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం వీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు ఖరారు చేయాలని ఆదేశించారు. అంతకుముందు టెర్మినల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి కంట్రోల్ రూమ్ భవనాన్ని ఖరారు చేశారు. ఈ పర్యటనలో జేసీ సేతుమాధవన్, జీసీసీ ఎం.డి. ఎస్.ఎస్.శోభిక, ట్రైనీ ఐఏఎస్ హరిఓంపాండ్య, జీఎంఆర్ ప్రాజెక్టు హెడ్ రామరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
2 వేల బస్సుల ఏర్పాటు
విజయనగరం అర్బన్: భోగాపురంలోని ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభ కార్యక్రమానికి ప్రజారవాణా కోసం 2 వేల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ఆర్టీసీ విజయనగరం జోన్ ఈడీ విజయగీత తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత జిల్లాల ప్రజారవాణా అధికారులు, డిపో మేనేజర్లు, మెకానికల్ విభాగ అధికారులతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది. సభకు వచ్చే ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అఽధికారులకు ఆమె స్పష్టమైన సూచనలు చేశారు. సభా ప్రాంగణం వద్ద పార్కింగ్ ప్రదేశాలను సీనియర్ అధికారులు, డిపో మేనేజర్లు స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు. కేటాయించిన బస్సులను ముందస్తుగా తనిఖీ చేసి, పూర్తి కండిషన్లో ఉన్న వాహనాలనే నడపాలని ఆదేశించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పూసపాటిరేగ: జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా బుధవారం సాయంత్రం పరిశీలించారు. టెర్మినల్ భవనం, రన్ వే, బహిరంగ సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.


