భామిని: మండలంలోని ఏకలవ్య స్కూల్ విద్యార్థి సవర ప్రవీణ్ ఆచూకీ లభించిందని బత్తిలి ఎస్సై కె.రవీంద్ర గురువారం తెలిపారు. లక్ష్మీనర్సుపేట మండల కేంద్రంలో విద్యార్థి సవర ప్రవీణ్ను గుర్తించామేన్నారు. తల్లిదండ్రులు సవర లలిత, ప్రసాద్లకు ఏకలవ్య స్కూల్ టీచర్ల సమక్షంలో విద్యార్థిని అప్పగించామని చెప్పారు. స్కూల్కు వచ్చిన తరువాత ఇంటిపై బెంగతో ప్రవీణ్ వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు.
మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణ
విజయనగరం ఫోర్ట్: స్థానిక మహిళా ప్రాంగణంలో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ, స్వయం ఉపాధి కల్పన నిమిత్తం దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాంగణం మేనేజర్ బి,రెబక్కా శామ్యూల్ తెలిపారు. అర్హులైన, అసక్తిగల 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ (75 రోజులు), స్యూయింగ్ మెషీన్ ఆపరేటర్ (50 రోజులు), హ్యాండ్ ఎంబ్రాయిడరీ (45 రోజులు), అసిస్టెంట్ క్రిచి కేర్టేకర్ (75 రోజులు) జేరియాటిక్ కేర్ టేకర్ (75 రోజులు) కోర్సులకు ఉచిత శిక్షణ తరగతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 30 వతేదీ లోగా సమర్పించాలని సూచించారు.
స్కూటీ ఎత్తుకుపోయిన స్నేహితుడు
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని గెడ్డతిరువాడ గ్రామానికి చెందిన కొలుసు ఆర్య స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన బొంగు కార్తీక్ అనే వ్యక్తి ఈనెల 18న ఆర్య స్కూటీని ఎత్తుకు పోయాడు. కార్తీక్ ఆ రోజు ఉదయం తన ఇంటికి వచ్చి తల దిండు కింద ఉన్న స్కూటీ తాళాన్ని తీసి స్కూటీతో పరారయ్యాడని, ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు తన బండిని అప్పజెప్పకుండా విశాఖపట్నం, తుని, ప్రాంతాలలో తిరుగుతున్నట్లు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి చెబుతున్నారని కొత్త స్కూటీని ఫైనాన్స్పై తీసుకున్నట్లు ఆర్య తెలిపాడు. ఈ విషయాన్ని గ్రామంలో ఉంటున్న కార్తీక్ తండ్రి వెంకటరమణ, కుటుంబసభ్యులకు తెలపగా మా అబ్బాయి కొన్ని సంవత్సరాలుగా ఇంటికి రావడం లేదని, ఇలాంటి పనులు చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదని తెలపడంతో చేసేదిలేక కొలుసు ఆర్య, తల్లి లక్ష్మి జియ్యమ్మవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు పాలిటెక్నిక్ చేసి బతకలేక పార్వతీపురంలో ఓ షాపులో పనిచేస్తుంటే జీవనం సాగిస్తున్నామని తల్లి లక్ష్మి తెలిపింది. ఎలాగైనా తన కుమారుడికి న్యాయం చేసి స్కూటీని తమకు అప్పచెప్పేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె వేడుకుంది.


