రామభద్రపురం: మండలకేంద్రంలో ఆటోలో నుంచి జారి పడి చికిత్స పొందూతూ ఉపాధిహామీ కూలీ మృతి చెందింది. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మారుతీ కాలనీలోని శివాలయం వీధికి చెందిన చింతల కన్నమ్మ(65) ఉపాధిహామీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ చెరువు పనులకు వెళ్తున్నట్లుగానే గురువారం ఉదయం కూడా మిగతా కూలీలతో కలిసి కొండకెంగువ రూట్ వైపు ఆటోలో రాణి బంద చెరువుకు వెళ్లింది.అక్కడ పని పూర్తయిన తర్వాత మళ్లీ ఆటోలో ఇంటికి వచ్చేస్తుండగా స్థానిక పీహెచ్సీ సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి వెనుకభాగాన కూర్చున్న కన్నమ్మకు చెందిన కాలిచెప్పు జారికింద పడింది. దీంతో చెప్పు కింద పడిపోయిందన్న ఉద్దేశంతో కన్నమ్మ కూడా కిందకు దిగడం వల్ల రోడ్డుమీద పడిపోయి దెబ్బ తగిలి తీవ్రగాయమైంది. దీంతో పక్కనే ఉన్న పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతిరావు ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేస్నుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుతో వ్యక్తి..
కురుపాం: మండలంలోని ఉదయపురం పంచాయతీ సంజువాయి గ్రామానికి చెందిన కూరంగి రమేష్ (42) పాముకాటుకు గురై గురువారం తెల్ల వారు జామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కూరంగి రమేష్ తన తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలిసి 22వ తేదీన కురుపాం మండల కేంద్రంలో నివాసం ఉంటున్న తన తల్లి ఇంటికి భార్యాపిల్లలతో వచ్చాడు. గురువారం తెల్లవారు జామున నేలపై నిద్రిస్తున్న సమయంలో రమేష్ కుడి చెవిపై కట్ల పాము కాటు వేయగా వెంటనే కుటుంబసభ్యులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య బుల్లెమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ మృతితో సంజవాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


