
జైపూర్: క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, సినీ నటి ప్రీతీ జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి రూ.1.10 కోట్ల విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు.
ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు. శనివారం జైపూర్లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతీ జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం’అని ఆమె పేర్కొన్నారు.