తమిళనాడులో దారుణం.. చిత్తూరు మహిళపై లైంగిక దాడి యత్నం | Pregnant Woman Thrown Out Of Moving Train In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో దారుణం.. చిత్తూరు మహిళపై లైంగిక దాడి యత్నం

Feb 7 2025 1:43 PM | Updated on Feb 7 2025 1:53 PM

Pregnant Woman Thrown Out Of Moving Train In Tamil Nadu

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో గర్భిణిపై లైంగిక దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించగా.. రైలు నుంచి ఆమెకు బయటకు తోసేశాడు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన రేవతి(36) తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లిందుకు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. బాధితురాలు రైలులోకి మహిళల కోచ్‌లో కూర్చుంది. తాను కోచ్‌లోకి ఎక్కిన సమయంలో ఆమె పాటుగా మరికొందరు మహిళలు కూడా ఉన్నారు.

కాగా, రైలు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే కోచ్‌లో మహిళలు అందరూ దిగిపోగా రేవతి ఒక్కరే ఉన్నారు. ఆ స్టేషన్‌లోనే నిందితుడు హేమరాజ్‌(27) మహిళల కోచ్‌కి ఎక్కాడు. రైలు ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే హేమరాజ్‌ కోచ్‌లోకి ప్రవేశించాడు. ఇక, కోచ్‌లోకి ఒంటరిగా ఉన్న రేవతిని నిందితుడు చూశాడు. కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కానీ, రేవతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో, ఆవేశానికి లోనైన నిందితుడు.. రేవతిపై దాడి చేసి ఆమెను కదులుతున్న రైలులో నుంచి బయటకు తోసేశాడు. ఈ క్రమంలో రేవతి.. చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రేవతిని వెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హేమరాజ్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement