శివాజీనగర: కర్ణాటక విధానసభ కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లలోని అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో సీటు పొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంది. 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ నుంచి నలుగురు సునాయాసంగా గెలుస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 135 కాగా, ఇంకా 23 ఓట్లు మిగిలి ఉంటాయి.
దీంతో ఐదో సీటు మీద కూడా హస్తం నేతలు కన్నేశారు. సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టణ్ణయ్య కాంగ్రెస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎస్.టీ.సోమశేఖర్, శివరామ్ హెబ్బార్కు కాంగ్రెస్తో సత్సంబంధాలున్నాయి. మరో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో ఐదో సీటును స్వాధీనం చేసుకోవచ్చని కేపీసీసీ నేతలు నిశ్చయించారు.
క్రాస్ ఓటింగ్ జరిగేనా?
బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 62 కాగా, 2 ఎమ్మెల్సీ సీట్లు పొందగలదు. ఇంకా 6 ఓట్లు మిగులుతాయి. జేడీఎస్ శిబిరంలో 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మద్దతు కోరుతోంది. ఈ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ జరుగుతుంది. అందుచేత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా కనిపెట్టడం కష్టమని పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్లు క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఐదో స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మొత్తం 7 స్థానాలకు అంతేమంది నామినేషన్ వేస్తే పోలింగ్ జరగదు. ఎనిమిది మంది బరిలో నిలిస్తే పోలింగ్ యుద్ధం తప్పదు.


