ఆహ్వానం పలికిన మంత్రి రిజిజు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీలుస్తూ వేరుకుంపటి పెట్టుకున్న వర్గాన్ని మోదీ సర్కార్ ఆదివారం జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలకడం వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ నుంచి వేరుబడిన 19 మంది ఎంపీలు తాము నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో విలీనమయ్యామని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన అభ్యర్థన ఇంకా పెండింగ్లో ఉండగానే చీలికవర్గానికి ఏకంగా అఖిలపక్షభేటీకి ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
తమకు పోటీగా చీలిక వర్గానికీ ఆహ్వానం అందడంపై మమత సారథ్యంలోని టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి అపహాస్యంచేస్తోందని టీఎంసీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు డిరెక్ ఓబ్రియాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. టీఎంసీ చీలిక వర్గం నేత సుదీప్ బందోపాధ్యాయ్ను అఖిలపక్షభేటీకి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు శనివారం ఒక లేఖ రాశారు. ‘‘బందోపాధ్యాయ్తోపాటు 19 మంది ఎంపీలు ఎన్సీపీఐలో ఇప్పటికే చేరారు.
అందుకే తిరుగుబాటు ఎంపీల నాయకుడినీ ఆహ్వానించాం. ఎన్సీపీఐ నామినేటెడ్ చీఫ్ విప్ హోదాలో చీలిక వర్గం నాయకురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తిదార్కూ ఆహ్వానం పలికాం’’అని రిజిజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ డిరెక్ ఓబ్రియాన్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇదంతా మోసం. ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమే. చీలికవర్గం టీఎంసీ ఎంపీల అంశం తనవద్దే ఉందని ఓవైపు స్పీకర్ చెబుతారు. మరోవైపు వీళ్లను ఎన్సీపీఐ ఎంపీలుగా పేర్కొంటూ రిజిజు అఖిలపక్ష భేటీకి సాదర ఆహ్వానం పలుకుతారు. టీఎంసీ ద్రోహులను అనర్హులుగా ప్రకటించాలి’’అని అన్నారు.
ప్రధానిని కలిసిన సుదీప్ బంధోపాధ్యాయ్...
అంతకుముందు సుదీప్ బంధోపాధ్యాయ్ శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక సీటింగ్కు స్పీకర్ బిర్లా అనుమతించిన కొద్దిసేపటికే సుదీప్ ప్రధానితో భేటీ కావడం గమనార్హం. అయితే మోదీతో సుదీప్ ఏం మాట్లాడారనే వివరాలు తెలియరాలేదు.


