బెంగాల్‌లోనూ బుల్‌డోజర్‌ న్యాయం | Bulldozer action on Trinamool MP Abhishek Banerjee office in West Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లోనూ బుల్‌డోజర్‌ న్యాయం

Jul 19 2026 5:54 AM | Updated on Jul 19 2026 5:54 AM

Bulldozer action on Trinamool MP Abhishek Banerjee office in West Bengal

టీఎంసీ కార్యాలయం కూల్చివేత

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటున్న అధికారులు 

కోల్‌కతా: బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన బెంగాల్‌లోనూ బుల్‌డోజర్‌ న్యాయం అమలవుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లా అమ్తాల్‌లో ఉన్న ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి చెందిన టీఎంసీ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. ఉదయం అమ్తాల్‌ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు దిగ్బంధించాయి. మధ్యాహ్నం వేళ అక్కడికి చేరుకున్న మూడు బుల్‌డోజర్లతో కార్యాలయం ముందున్న షెడ్‌ను, భవనం ముందు భాగాన్ని నేలమట్టం చేశాయి. 

భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని జిల్లా అధికారులు తెలిపారు. భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 15వ తేదీన సంబందీకులకు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. భవన యాజమాని, నిర్మాణ వివరాలు కావాలని అడిగినా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. అందుకే, చట్ట ప్రకారం, నిబంధనల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు.

 కాగా, ఆ సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కూల్చివేత సమయంలో భవనంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెద్ద సంఖ్యలో ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్‌ డైమండ్‌ హార్బర్‌ ఎంపీ కాగా, అమ్తాలా ఆ నియోజకవర్గంలో ఒక భాగం. టీఎంసీ పార్టీ కార్యాలయం నడుస్తున్న ఈ భవనం లీప్స్‌ అండ్‌ బౌండ్‌ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసినట్లు రికార్డుల్లోఉందని అధికారులు తెలిపారు.  

అన్ని అనుమతులు ఉన్నాయి: ఎంపీ అభిషేక్‌ 
అమ్తాలాలోని టీఎంసీ కార్యాలయ భవనమున్న స్థలాన్ని తాము కొనుగోలు చేసిన చోటే అన్ని అనుమతులు పొందాకే నిర్మించినట్లు ఎంపీ అభిషేక్‌ బెనర్జీ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిలోనే భవనాన్ని కట్టామని చెప్పారు. దీనిపై కలకత్తా హైకోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్‌ వేస్తామని, సత్వరమే విచారణ చేపట్టాలని కోరుతామన్నారు. భవనాన్ని బుల్‌డోజర్లతో ధ్వంసం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు కూడా అందులో పాలుపంచుకోవడం, ఆ ప్రాంతంలో కూల్చివేతలను పర్యవేక్షించిన అధికారులు, సిబ్బందికి సంబంధించిన మొత్తం వీడియో తమ వద్ద ఉందన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)కి కూడా ఫిర్యాదు చేస్తామని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement