
భారత్లో వాళ్లు విలీనమయ్యే రోజు వస్తుంది
రక్షణ మంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రజలు ముమ్మాటికీ మన సొంత కుటుంబసభ్యులేనని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా భారతదేశ ప్రధాన స్రవంతిలోకి పీవోకే ప్రజలు వచ్చేరోజు ఒకటి వస్తుందని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) వాణిజ్య సదస్సులో రాజ్నాథ్ పాల్గొని ప్రసంగించారు.
‘‘ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నినాదానికి మనం కట్టుబడే ఉంటాం. భౌగోళికంగా, రాజకీయంగా మన నుంచి దూరంగా(పీవోకేలో) జీవిస్తున్న మన సోదరులంతా ఏదో ఒక రోజు మళ్లీ భారతదేశ ప్రధాన ప్రసంతిలో కలిసి నడుస్తారు. వాళ్ల మనోవాణి నాకు వినిపిస్తోంది. అందుకే పీవోకేలోని వాళ్లంతా మన సొంత కుటుంబసభ్యులేనని నేను గట్టిగా విశ్వసిస్తా. ఏదో కొద్దిమంది తప్పుడు మార్గంలో పయనిస్తున్నారుగానీ అక్కడి వాళ్లలో చాలా మందికి భారత్తో దృఢసంబంధాలు పెనవేసుకున్నాయి.
భారత్తో పీవోకే విలీనం అనేది దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన కీలకాంశం’’ అని అన్నారు. ‘‘ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి పెద్దగా ఖర్చుకాదు. కానీ ఉగ్రవాదం తాలూకు పెను విపరిణామాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాక్ ఇప్పుడిదే మూల్యం చెల్లించుకుంటోంది. భారతదేశ శ్రేయస్సు, భద్రతకు మేకిన్ ఇండియా విధానం ఎంతో ముఖ్యమైనదని ఆపరేషన్ సిందూర్తో స్పష్టమైంది.
శత్రుదేశాల గగనతల రక్షణ కవచాలను చీల్చుకుంటూ ముందుకెళ్లగలమని ఆపరషన్ సిందూర్తో భారత్ నిరూపించింది. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్లున్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి ఇప్పుడు రూ.23,500 కోట్లకు పెరిగింది. యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థలనేకాదు కొత్తతరం యుద్ధసాంకేతికతలనూ భారత్ అభివృద్ధిచేస్తోంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్కు ఇటీవలే ఆమోదముద్ర వేశాం. తొలుత ఐదు నమూనాలను తయారుచేసి తర్వాత పూర్తిస్థాయి ఉత్పత్తిని మొదలెడతాం’’ అని మంత్రి చెప్పారు.