కిలోమీటర్ లోపు పూర్తి నిషేధం
50 కి.మీల వరకూ సున్నిత ప్రాంతం
కేంద్ర హోం శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి కిలోమీటరు పరిధిలో కొత్త సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాతోపాటు భారత్తో హద్దులు పంచుకునే దేశాల నుంచి ప్రాజెక్టు సిబ్బంది, ఇంజినీర్లు, కారి్మకులను నియమించరాదని స్పష్టం చేసింది.
ఈ మేరకు శనివారం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో పలు సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలతపై దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం...నియంత్రణ రేఖ, వాస్తవా«దీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ. పరిధిలోని ప్రాంతాలు ‘సున్నిత ప్రాంతాలు’. అలాగే... అంతర్జాతీయ సరిహద్దు నుంచి 20 కి.మీ. పరిధిలో ప్రాజెక్టులకు రక్షణశాఖ నుంచి ప్రత్యేక నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ అవసరమవుతుంది.
ఒకటి నుంచి 20 కి.మీ. పరిధిలోని ప్రాజెక్టులకు భద్రతా అనుమతి, రక్షణశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను ఆయా ప్రాజెక్టులను బట్టి నిర్ణయిస్తారు. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రాజెక్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంతే కాకుండా... కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, హోంశాఖ భద్రతా అనుమతి సహా, ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమిని విదేశీ సంస్థకు బదలాయించరాదని హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే హోంశాఖ నుంచి భద్రతా అనుమతి పొందిన ప్రాజెక్టులు కొత్త మార్గదర్శకాల కింద మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, రక్షణశాఖ నుంచి ఇప్పటికే నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ పొందిన ప్రాజెక్టులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.


