నీట మునిగిన షాజహాన్‌పూర్‌.. తొమ్మిదిమంది మృతి | Nine People Died Due to Floods | Sakshi
Sakshi News home page

నీట మునిగిన షాజహాన్‌పూర్‌.. తొమ్మిదిమంది మృతి

Jul 11 2024 9:44 AM | Updated on Jul 11 2024 9:44 AM

Nine People Died Due to Floods

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నీట మునిగింది. నగరంలోని 20కి పైగా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సమీప గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల మంది వరద బారిన పడ్డారు. బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  ఎన్‌డిఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.  

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద నీటిలో కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. లఖింపూర్ ఖేరీలో ఐదుగురు, బరేలీలో ఇద్దరు, పిలిభిత్‌లో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. బదౌన్‌లో మోపెడ్‌తో సహా ఒక యువకుడు నీటి మునిగాడు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆహారం లేక అలమటిస్తున్నారు.

ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న గర్రా, ఖన్నాత్ నదులలోని నీరు షాజహాన్‌పూర్‌లోకి ప్రవేశించింది. ఈ నగరం ఈ రెండు నదుల మధ్య ఉంది. స్థానిక మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు.. రెండు వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  కాగా రానున్న మూడు, నాలుగు రోజుల పాటు యూపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం లఖింపూర్ ఖేరీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్‌లలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement