
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ల కథనం మరువకముందే జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.
జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్గఢ్కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు