
మాజీ ఐసీఎంఆర్ చీఫ్ భార్గవ భరోసా
న్యూఢిల్లీ: కరోనా వైరస్లలో కొత్తగా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ పుట్టడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సార్స్–కోవ్–2 వేరియంట్లో సహజ ఉత్ప్రరివర్తనమని భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. భారత్లో వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో 200 కేసులు ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కారణంగా సోకాయని నిర్దారణ కావడంతో ఈ అంశంపై భార్గవ స్పందించారు.
‘‘ సార్స్–కోవ్–2 తరచూ సహజంగా పరివర్తనం చెందుతోంది. దాని ఉత్పరివర్తనమే ఎక్స్ఎఫ్జీ. ఇది సహజ ఆవిర్భావమే’’ అని ఆయన అన్నారు. జూన్ 11వ తేదీనాటికి దేశవ్యాప్తంగా కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 7,000 మార్కును దాటింది. గత 24 గంటల్లోనే 300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్ కారణంగా కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
సార్స్–కోవ్–2 జన్యువిశ్లేషణ కన్సార్షియం(ఇన్సాకాగ్) తాజా గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా 206 దాకా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కేసులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎక్స్ఎఫ్జీ కేసులున్నాయి. వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 89, పశ్చిమబెంగాల్ నుంచి 49, కేరళలో 15, తమిళనాడులో 16, గుజరాత్లో 11, మధ్యప్రదేశ్లో 6, ఆంధ్రప్రదేశ్లో ఆరు, ఒడిశాలో మూడు, తెలంగాణ ఒక కేసు నమోదయ్యాయి. ‘‘మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ఏమార్చగలదని తొలుత వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో వ్యాధి ముదురుతుందనే బలమైన ఆధారాలు లేవు’’ అని భార్గవ అన్నారు.