అభివృద్ధి దిశగా నూతన ప్రయాణానికి శ్రీకారం
బెంగాల్ గాలిలో ఒక తాజాదనం కనిపిస్తోంది
ప్రజల ముఖాల్లో కొత్త కాంతి దర్శనమిస్తోంది
ప్రజాస్వామ్య శక్తిని అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించింది
‘పశ్చిమ్బంగ దివస్’వేడుకల్లో ప్రధాని మోదీ వెల్లడి
పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరాచక పాలన సంకెళ్లను ఛేదించుకొని బీజేపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శనివారం బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో ‘పశ్చిమ్బంగ దివస్’వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక తాజాదనం కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ వైభవం తిరిగి మొదలైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఒక కొత్త కాంతి దర్శనమిస్తోందని, గ్రామాల్లో ఆనందం, నమ్మకం అనే భావన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజల ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించిందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్ఫాస్ట్ స్పీడ్తో పని పనిచేస్తోందని మోదీ తేల్చిచెప్పారు.
ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు
‘‘రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ, అనుసంధాన రంగాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. బెంగాల్ తన నూతన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
రాజకీయ వైరం కారణంగా ఇక్కడ ఏళ్ల తరబడి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి, కొన్ని ఆలస్యమయ్యాయి. నేడు ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ప్రతి ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. కంచె నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి’’ అని మోదీ ఉద్ఘాటించారు.
అభివృద్ధికి గేటు వే తూర్పు భారత్
రాయ్రంగ్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి ఒక ముఖద్వారంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. రాయ్రంగ్పూర్లో రూ.47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ‘పూర్వోదయ’విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మారుస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
ముర్ము అత్తగారి గ్రామానికి మోదీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని మయూర్భంజ్ జిల్లాలోని ఆమె అత్తగారి గ్రామమైన పహద్పూర్ను మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని ‘సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పహద్పూర్ ఒక ఆదర్శవంతమైన సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ నేల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిశాకు, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సంతాలీ భాషకు ‘ఓల్ చికి’లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ముకు మోదీ నివాళులరి్పంచారు.
కిసాన్ సమ్మాన్ నిధి విడుదల
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన వంటి పథకాలను మోదీ ప్రారంభించారు.


