-
పారదర్శకంగా పాలనా వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రజలపై ప్రభుత్వ పరిపాలన ప్రభావాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిస్థాయిలో విధానాలను, ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా పాలనా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా తీర్చదిద్దడానికి శ్రమిస్తున్నామని అన్నారు. సుపరిపాలనా వారం(సుశాసన్ సప్తాహ్) సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు దేశ ప్రజలకు సందేశామిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ దాకా సుపరిపాలనా వారం జరుపుకోనున్నారు. ‘ప్రజలే కేంద్రంగా’ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, దరఖాస్తుల స్వీకరణ–పరిష్కారం, సుపరిపాలనా విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాలం చెల్లిన వేలాది చట్టాలను రద్దు చేశామన్నారు. అనవసర విధానాలు, పద్ధతులకు స్వస్తి పలికామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రజలు సాధికారత సాధించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. -
చాటుమాటు పాలన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. ప్రభుత్వ పరిపాలన రోజురోజుకు గోప్యమవుతోంది. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు ప్రజలు తెలుసుకోడానికి అందుబాటులో తెచ్చిన జీఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్) వెబ్సైట్లో జీవోల నమోదు క్రమంగా తగ్గిపోతోంది. గత మూడేళ్లలో వెబ్సైట్లో జీవోల అప్లోడ్ తంతు మూడో వంతుకు పడిపోయింది. చిన్నాచితకా అంశాల జీవోలు మినహా.. పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలకు సంబంధించిన కీలక జీవోలను బహిర్గతం చేయడం లేదు. పాలనలో పారదర్శకత పాటిస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు.. కీలక నిర్ణయాలు, ఆదేశాల జారీలో మాత్రం గోప్యత పాటిస్తోంది. 2017లో 8,600 జీవోలే 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి 21,702 జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయగా.. 2017లో కేవలం 8,696 జీవోలే అప్లోడ్ అయ్యాయి. ఈ లెక్కన మూడేళ్లలో జీవోల సంఖ్య మూడో వంతుకు పతనమైంది. పాలనాపర అంశాలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేస్తున్నా.. వాటిని వెబ్సైట్లో మాత్రం అప్లోడ్ చేయడం లేదు. సాంకేతిక విభాగం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతోనే జీవోలు ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెండు, మూడేళ్లుగా వెబ్సైట్లో కనిపించడం లేదు. ఉన్నతాధికారుల బదిలీలు, కొందరి నియామకాలు, పదోన్నతులు, శాఖాపరమైన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జీవోలు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదు. కొన్ని ఆయా శాఖల ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా ఆ వెబ్సైట్లపై అవగాహన లేక వివరాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. కుప్పలుతెప్పలుగా సాధారణ జీవోలు చిన్నాచితకా ఉత్తర్వులే వెబ్సైట్లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులకు టీఏ, డీఏ మంజూరు, పేపర్ బిల్లుల చెల్లింపులు, స్టేషనరీ, లేబర్ కేసుల వివరాలు వందల్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ.. ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గవర్నర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. త్వరలో ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు. -
2016 ఆశలు-ఆశయాలు
నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన అధికారులు ఏమనుకుంటున్నారు.. కొత్త సంవత్సరంలో వారి ఆశలు, ఆశయాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి. కొత్త సంవత్సరంలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అందరూ కాంక్షించారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే.. - సాక్షి, హైదరాబాద్ రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. వరుణ దేవుడు కరుణించాలి. మంచి వర్షాలు కురవాలి. పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి. అవినీతి రహిత, నిర్లక్ష్య రహిత పాలన ఉండాలి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఎక్కడ అవినీతి జరుగుతుందో గుర్తించి కట్టడి చేయాలి. లంచం ఇచ్చే వారికి శిక్షలు వేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తిరుపతిలోనే న్యూ ఇయర్ : భన్వర్లాల్, ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి ప్రతి ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తాను. దాదాపు 20 ఏళ్లుగా డిసెంబర్ 31 లేదా జనవరి 1న తిరుపతికి వెళ్తున్నా. ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అక్కడే. కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో ఎన్నికల కమిషన్ ముందున్న లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఏపీలో చిత్తూరు ఎమ్మెల్సీ సీటు ఒకటి ఖాళీగా ఉంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున ఎన్నిక నిర్వహించలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఎన్నిక జరుపుతాం. ఫిబ్రవరి 25 లోపు తెలంగాణలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాం. 2016 మార్చి 11న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. జనవరి 25న రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తాం. బెస్ట్ పోలీసింగ్.. ఇదే మా విజన్ : అనురాగ్ శర్మ, డీజీపీ రాష్ట్ర పోలీసు విభాగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. కొత్త రాష్ట్రానికి మొదటి డీజీపీగా అరుదైన అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అనేలా చేయాలన్నదే ఆకాంక్ష. బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పట్టణీకరణ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైబర్క్రైం అదుపు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మావోయిజం, ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన విఘాతంగా మారినట్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతిమంగా మా లక్ష్యం ప్రజా శ్రేయస్సు.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ప్రజల సహకారంపైనే ఆశలు బి.జనార్దన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ నూతన సంవత్సరంలో హైదరాబాద్ నగర ప్రజల సహకారంపైనే ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నా. పురపాలనలో ప్రజల సహకారం లేనిదే ఏ పని విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని పొందడమే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని. కొత్త ఏడాదిలో ప్రజల నుంచి మంచి భాగస్వామ్యం పొందుతామని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎక్కువగా ప్రభుత్వ రవాణా వాహనాలను వినియోగించటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించటం.. తదితర అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్యకరమైన హైదరాబాద్ను తీర్చిదిద్దటమే నా ప్రధాన ధ్యేయం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఓ భరోసా. వారి మనోగతానికి తగ్గట్టుగా రైళ్లను నడపడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచటమే కొత్త సంవత్సరంలో మా కర్తవ్యం. సకాలంలో భద్రంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు 24 గంటల పర్యవేక్షణకు మరింత పదును పెడతాం. సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుత్ను ఆదా చే స్తూ, పర్యావరణానికి మేలు చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తాం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తే దేశం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. అందుకే అంతా స్వచ్ఛభారత్ను విజయవంతం చేద్దాం. హరిత భారత నిర్మాణంలో పాలు పంచుకుందాం. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రైల్వే క్లబ్లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటా. 2016.. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు విభాగం వచ్చే ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటుంది. పోలీసు విధి నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలను అరికట్టేందుకు, జరిగిన నేరాలకు కొలిక్కి తీసుకురావడంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కాప్ లెస్ జంక్షన్స్ విధానాన్ని అమలు జరుగుతోంది. పోలీసు ప్రమేయం లేకుండా వాహనచోదకులు తమంతట తామే నిబంధనలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కనిపించకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడతాం. నగర పోలీసుకు సంబంధించి 2016 ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ ఆకాంక్షించారు. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలి. అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకెళ్లాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి. -
రోజూ 10 లక్షల మందికి అన్నదానం
కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు - ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తాం - ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కర స్నానం - వర్తక, వాణిజ్య సంఘాలు ముందుకు రావాలి - ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల ముకరంపుర : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రైస్మిల్లర్స్తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. గోదావరిలో నీటి కొరత దృష్ట్యా ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5కోట్ల మంది జిల్లాలో పుష్కరస్నానాలకు వచ్చే అవకాశముందన్నారు. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్రంలో రూ.600 కోట్లతో పలు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 13న ధర్మపురి చేరుకుని రాత్రి బస చేస్తారని, 14న ఉదయం 6.26 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరిస్తారని పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సేవలందించేందుకు ముందుకు రావాలి పుష్కరాల్లో రోజుకు 10లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం దాతలు, స్వచ్చంద సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగరావుతో పాటు బాధ్యులు ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల వద్ద ఉద్యోగులకు, ఇతర భక్తులకు రోజుకు 2-4 వేల మందికి అన్నదానం చేసేందుకు సహకరిస్తామన్నారు. జువెల్లరీ అసోసియేషన్ బాధ్యులు రమేష్ మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కంకర క్రషర్ సంఘం ప్రతినిధి అంజయ్య రూ.2లక్షలు విరాళం అందిస్తామన్నారు. ఐఎంఏ బాధ్యులు అవసరమైన వైద్యసిబ్బందితో క్యాంపులు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రైవేట్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా వైద్యశాఖ సూచనల మేరకు అన్నివిధాలా సహకరిస్తామన్నారు. వెల్గటూర్ కంకర ప్రెషర్ యాజమాన్య బాధ్యులు చక్రవర్తి కోటిలింగాల వద్ద 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని, పుష్కరఘాట్లకు ప్రెషర్ డస్ట్ను పంపిస్తామని అన్నారు. దాతలు అందించే సేవా కార్యక్రమాలను డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు పర్యవేక్షిస్తారని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. -
చేతగాని మంత్రులు రాజీనామా చేయాలి
సీపీఐ రైతు సంఘం నాయకుల డిమాండ్ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ జిలాల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులోని విత్తన పంపిణీ కేంద్రం వద్ద గురువారం సంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 3.28 లక్షలు క్వింటాళ్లు కేటాయించినా కనీసం 2 లక్షల క్వింటాళ్లు కూడా పంపిణీ చేయకుండానే కార్య క్రమాన్ని ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా కొనసాగడం కన్నా రాజీనామా చేయడం మేలన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రెండో విడత, మూడో విడత విత్తన పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరెడ్డి, రఘురామయ్య, నాగరాజు, వెంకటనారాయణ, వెంకటేష్నాయక్, సీపీఐ నాయకులు మస్తాన్, ఎర్రిస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement