ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్‌ | Mumbai on high alert amid terror threat warnings | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్‌

Sep 28 2024 11:36 AM | Updated on Sep 28 2024 11:53 AM

Mumbai on high alert amid terror threat warnings

ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్‌లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్‌ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌తో నగరం అప్రమత్తమైంది.

నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్‌లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.

ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్  ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్‌లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా  ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్‌

Advertisement
 
Advertisement
Advertisement