
న్యూఢిల్లీ: ‘పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడి, భారతీయులను విభజించాలని కోరుకున్న ముష్కరులకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని అన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదులు చేసింది కేవలం భారతీయులపై దాడి మాత్రమే కాదు. ఇది మానవత్వంపై జరిగిన దాడి. మన సోదర స్ఫూర్తిపై దాడి. అయితే ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం వారికి బలమైన ప్రతిస్పందన చూపామని ప్రధాని మోదీ బాగ్డోగ్రాలో వర్చువల్గా జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
నేడు (గురువారం) జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సిక్కిం పర్యటన ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని హాజరుకావలసి ఉంది. దీనిలో భాగంగా ఆయన గ్యాంగ్టక్ చేరుకుని, రూ. 750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించని కారణంగా రద్దయ్యాయి. దీంతో ప్రధాని మోదీ బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సిక్కిం ప్రజాస్వామ్య ప్రయాణంలో స్వర్ణోత్సవం అని అన్నారు. తాను రాష్ట్ర ప్రజల సమక్షంలో ఉంటూ, 50 వసంతాల విజయవంతమైన ప్రయాణాన్ని చూడాలనుకున్నానని, అయితే ఢిల్లీ నుండి బాగ్డోగ్రా చేరుకోగానే, అక్కడి వాతావరణం తనను మరింత ముందుకు వెళ్లకుండా ఆపివేసిందని, ఫలితంగా సిక్కిం ప్రజలను వ్యక్తిగతంగా కలిసే అవకాశం దక్కలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సిక్కిం 50వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మలచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృష్టిచేశారని ప్రధాని అన్నారు. సిక్కిం 50వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సిక్కిం తనకు తానుగా ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించుకుందని, నాడు సిక్కిం(Sikkim) ప్రజలు భారతదేశంతో కనెక్ట్ కావాలని కోరుకున్నారన్నారు. ఈ రోజు సిక్కింలోని ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. 50 ఏళ్లలో సిక్కిం 100శాతం సేంద్రీయ రాష్ట్రంగా మారిందని, సంస్కృతి, వారసత్వ సంపదకు చిహ్నంగా ఉద్భవించిందని ప్రధాని అన్నారు.
2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెప్పామని, ఈ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చిందని మోదీ పేర్కొన్నారు. నేడు సిక్కిం అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని, ఇది నవ భారత అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయంగా మారనున్నదని ప్రధాని మోదీ అన్నారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..