
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి(మే 29) నుంచి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సిక్కిం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన బీహార్లోని పట్నా విమానాశ్రయ టెర్మినల్, విద్యుత్ ప్లాంట్, కాన్పూర్ మెట్రో విస్తరణతో పాటు పశ్చిమ బెంగాల్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లలో ప్రధాని మోదీ(Prime Minister Modi) పర్యటన సాగనుంది.
సిక్కింలో..
నేటికి సిక్కిం కొత్త రాష్ట్రంగా ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(Prime Minister's Office) విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం సిక్కింలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. రూ. 750 కోట్లకు పైగా విలువైన నామ్చిలో 500 పడకల కొత్త ఆసుపత్రి, గ్యాల్షింగ్ జిల్లాలో రోప్వే గ్యాంగ్టక్ జిల్లాలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రారంభోత్సం మొదలైనవి ఉన్నాయి. సిక్కిం రాష్ట్ర స్మారక నాణెం, స్టాంపును కూడా ప్రధాని విడుదల చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్లో..
మే 29న 2:15 గంటలకు అలీపుర్దువార్, కూచ్ బెహార్ జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని పశ్చిమ బెంగాల్ చేరుకోనున్నారు. రూ. 1,010 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్ట్, 2.5 లక్షలకు పైగా గృహాలకు, పలు వ్యాపార సంస్థలకు పైపుల ద్వారా సహజ వాయువును అందించడంతో పాటు, వాహనాల కోసం 19 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.
బీహార్లో..
గురువారం సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని బీహార్లోని పట్నా చేరుకుని అక్కడి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ టెర్మినల్ ఏటా కోటి మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగివుంటుంది. అలాగే కరకట్లో రూ. 48,520 కోట్లకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్లో..
శుక్రవారం(మే 30) మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగర్కు చేరుకోనున్నారు. అక్కడ ఆయన సుమారు రూ. 20,900 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో రూ. 2,120 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన ప్రాజెక్టు ఉంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ వయ్ వందన యోజన, జాతీయ జీవనోపాధి మిషన్ తదితర సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, చెక్కులను అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: 31న వేలల్లోఉద్యోగుల రిటైర్మెంట్.. కేరళలో ప్రతీయేటా ఎందుకిలా?