
తిరువనంతపురం: ఈ ఏడాది మే 31న కేరళలో మరో ఆసక్తికర రికార్డు నమోదు కానుంది. ఏకంగా 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకే రోజున (మే 31) పదవీ విరమణ(Retirement) చేయనున్నారు. గత ఏడాది(2024)లో ఇదే రోజున 10వేల 560మంది రిటైర్ అయ్యారు. 2023లోనూ మే 31న 11 వేల 800 మంది పదవీ విరమణ చేశారు. దీనివెనుక ప్రత్యేక కారణముంది.
దేశంలోని పర్యాటక ప్రాంతాల పరంగా కేరళ ముందుంటుంది. ఆకట్టుకునే ప్రదేశాలు, అలరించే కళలు కేరళ సొంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వీటితో పాటు కేరళ అనగానే ఒక అంశం చర్చల్లోకి వస్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ. కేరళలో ప్రతీయేటా మే 31న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేస్తుంటారు. ఇదే కోవలో ఈ ఏడాది(2025) మే 31న 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.
ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, అటెండర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్ర సచివాలయం(State Secretariat)తో సహా పలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేరళలోని ప్రభుత్వ ఉద్యోగులు 56 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మే నెలలో పుట్టిన తేదీ కలిగినవారు, 56 సంవత్సరాల వయస్సు వచ్చిన వారంతా మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏటా మే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయడం వెనుక ప్రత్యేక కారణముంది.
గతంలో తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన తేదీని వారు పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్లిన రోజున నమోదు చేసేవారు. సాధారణంగా పాఠశాలల్లో అడ్మిషన్లు జూన్లో ప్రారంభమవుతాయి. గతంలో పాఠశాలల్లో ప్రవేశాలకు ఎటువంటి అధికారిక జనన ధృవీకరణ పత్రాన్ని అడిగేవారు కాదు. దీంతో పలువురు విద్యార్థుల పుట్టిన తేదీ జూన్ నెలలోనే ఉండేది. ఈ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నవారి పదవీ విరమణ మే నెలలోనే జరుగుతుంది. మరోవైపు గతంలో పుట్టిన తేదీని సరిచేయాల్సిన అవసరం ఉండేదికాదు. అయితే ఇప్పుడు నిబంధనలు మారాయి. ప్రతీ ఆస్పత్రిలో శిశువు జననాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారిక కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.