హైపవర్డ్ యాక్షన్ | PM Narendra Modi announces high-powered task force to make exams | Sakshi
Sakshi News home page

హైపవర్డ్ యాక్షన్

Jul 27 2026 1:34 AM | Updated on Jul 27 2026 1:34 AM

PM Narendra Modi announces high-powered task force to make exams

పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌: ప్రధాని మోదీ

ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని నేతృత్వంలో ఏర్పాటు

నేడు పార్లమెంటు ముందుకు ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌’ సవరణ బిల్లు

విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ వినియోగానికి అనుమతిచ్చింది మీరేనా అంటూ అమిత్‌ షాకు రాహుల్‌ గాంధీ లేఖాస్త్రం

నేడు పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాల సన్నద్ధం

 పంజాబ్‌ ఫార్మసీ రిక్రూట్‌మెంట్‌ అక్రమాలపై పోరుకు సీజేపీ యోచన

తదుపరి కార్యాచరణ దిశగా సాగుతున్నఅన్ని పక్షాలు

దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. 

ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్‌ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్‌’ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు చెప్పారు. 

పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్‌ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. 

విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్‌ గన్స్‌ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్‌ షాకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖాస్త్రం సంధించారు. 

మరోవైపు నీట్‌ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్‌ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్‌ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్‌ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్‌ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్‌ 
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్‌’ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 

ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్‌ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్‌ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. 

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్‌ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.   

విశ్వసనీయంగా, పారదర్శకంగా...  
నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.    

టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు  
నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్‌ టాస్క్ ఫోర్స్‌లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది.   
→ టెక్నాలజీ నిపుణుడు నందన్‌ నీలేకని  
→ ఇస్రో మాజీ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ 
→ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ డైరెక్టర్‌ తపన్‌ డేకా  
→ ఐఐటీ–చెన్నై డైరెక్టర్‌ వి.కామకోటి 
→ విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్‌ 
→ లాజిస్టిక్స్‌ నిపుణుడు అమృత్‌ లాల్‌ మీనా

టెక్నాలజీ దిగ్గజం నీలేకని  
నందన్‌ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందించారు. ‘ఆధార్‌’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్‌ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్‌ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్‌ డిగ్రీని పొందారు. పద్మభూషణ్‌ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.

ఫోర్బ్స్‌ ఆసియా బిజినెస్‌మేన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, బిజినెస్‌ స్టాండర్డ్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు ఆయనను వరించాయి. ఏక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్‌’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.

టాస్క్ ఫోర్స్‌ బాధ్యతలు  
→ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం
→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం
→ పేపర్‌ లీకేజీలు, మాల్‌ ప్రాక్టీస్‌ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం 
→ జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement