Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి | major Fire At SCB Medical College Hospital In Odisha Cuttack | Sakshi
Sakshi News home page

Odisha : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది మృతి

Mar 16 2026 7:32 AM | Updated on Mar 16 2026 7:59 AM

major Fire At SCB Medical College Hospital In Odisha Cuttack

భువనేశ్వర్‌: ఒడిశా కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది మరణించగా, మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన ఐసీయూ వార్డులో మొత్తం 23 మంది చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, వైద్యులు సహాయక చర్యలు ప్రారంభించారు. రోగులను ఇతర ఐసీయూ, జనరల్‌ వార్డులకు తరలించే సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే మరో ముగ్గురు మరణించారు. 

ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ
ఒడిశాలో ఎస్‌సీబీ ఆస్పత్రి ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఆరోగ్యశాఖ మంత్రి మహాలింగ్‌ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. భారీ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.    

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement