మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) వాయిదా పడింది. భివాండీలో పరీక్షా పత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ (MSCE) ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,028 కేంద్రాల్లో జూన్ 28న టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని భద్రతా చర్యలను ముందే కట్టుదిట్టం చేసిందని అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందగా తక్షణమే స్పందించిన పోలీసులు భివాండిలో టెట్ పేపర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. పేపర్-1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరగాల్సి ఉంది.


