‘క్షమించు తల్లి’.. చిన్నారికి స్కూల్‌ ప్రిన్సిపల్‌ క్షమాపణలు | Late By 5 Minutes, 13-year-old Made To Do 50 Squats In Maharashtra School | Sakshi
Sakshi News home page

‘క్షమించు తల్లి’.. చిన్నారికి స్కూల్‌ ప్రిన్సిపల్‌ క్షమాపణలు

Jan 20 2025 9:37 PM | Updated on Jan 20 2025 9:37 PM

Late By 5 Minutes, 13-year-old Made To Do 50 Squats In Maharashtra School

ముంబై : ఐదు నిమిషాలు ఆలస్యంగా క్లాస్‌ వచ్చిన చిన్నారిపై ఓ స్కూల్‌ యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. చిన్నారితో బలవంతంగా 50 గుంజీలు చేయించింది. దీంతో చిన్నారి అస్వస్థతకు గురైంది.  

మహరాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ స్కూల్‌కు చెందిన 13ఏళ్ల చిన్నారి స్కూల్‌కు ఆలస్యంగా వచ్చింది. దీంతో స్కూల్‌కు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ప్రశ్నించిన స్కూల్‌ ప్రిన్సిపల్‌ చిన్నారితో 50 గుంజీలు తీయించారు. ఫలితంగా చిన్నారి నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

స్కూల్‌ యాజమాన్యం తీరుపై సమాచారం అందుకున్న తల్లిదడడ్రులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపల్‌పై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రిన్సిపల్‌పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పిల్లలు కోరారని, పిల్లల విజ్ఞప్తితో తల్లిదండ్రులు కేసును ఉపసంహరించుకున్నట్లు పాల్ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై అనంత్‌ పరాడ్‌ తెలిపారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినట్లు చెప్పారు.

పాఠశాల యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామని, భవిష్యత్తులో అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని వారికి సూచించామన్నారు.  ఇక స్కూల్‌ ప్రిన్సిపాల్ సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. అనంతరం క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement