జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌ | Gnyaneshwari Missing Case Updates | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌

Jun 16 2026 7:08 PM | Updated on Jun 16 2026 7:39 PM

Gnyaneshwari Missing Case Updates

సాక్షి,కాకినాడ: దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీహెచ్‌ అగ్రహారంలో చిన్నారి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అందులో తాను 40 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట ఉంది. 

ఆ పామాయిల్ తోటలో చిన్నారి దాటిన కంచె వద్ద రెండు ఆట బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఈ బొమ్మలు అక్కడ కట్టిందెవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. వందల ఎకరాలు గాలింపు చర్యల్లో భాగంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ఎంతవరకు చేశారనేది నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ బొమ్మల్ని కంచెకు కట్టినట్లు తెలుస్తోంది.  ఈ బొమ్మలపై స్పష్టత రావాల్సి ఉండగా.. జ్ఞానేశ్వరి తల్లి భవానీ ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు. 

జూన్ 6న తుని సమీపంలోని చిన్న అగ్రహారం గ్రామంలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. పోలీసులు విస్తృతంగా శోధన చేపడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి సుంకర భవానీ  సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. మీడియా ఎదుట ఆమె ఏడవకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

‘కెమెరా ముందు ఏడవడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఆమె వాపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు తనను మనోవేదనకు గురి చేస్తున్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి తల్లి మాట్లాడుతూ.. జనం సూటి పోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. నిందలు వేయడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. సోషల్ మీడియాలో కామెంట్లు మనో వేధనకు గురి చేస్తున్నాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా పరిష్కారం కాని పరిస్థితిలో, కుటుంబం ఆందోళనతో పాటు సోషల్ మీడియా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది.

ప్రస్తుత జ్ఞానేశ్వరి కేసు వివరాలు
జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు అదే కుటుంబానికి చెందిన పెట్ డాగ్ కూడా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది కానీ అసాధారణ ప్రవర్తన చూపించింది. పోలీసులు జీపీఎస్‌ ట్రాకర్ అమర్చారు. కానీ కుక్క ఆరోగ్యం క్షీణించి జూన్ 13న చికిత్సలో మరణించింది. దీంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు,ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌  బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.అడవి జంతువుల ప్రమేయం ఉందేమో తెలుసుకోవడానికి మాంసంతో నింపిన బొమ్మలను పొలాల వద్ద అమర్చారు. కుటుంబ సభ్యులు, పొరుగువారు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పామాయిల్‌ తోటల్లో ట్రాక్టర్లతో గడ్డిని తొలగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను బయటకు పంపుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement