సాక్షి, హైదరాబాద్: కిమ్స్ వైద్యులు అద్భుతం సృష్టించారు. తీవ్రమైన శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్న 9 నెలల శిశువుకి ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాణాలు పోశారు. 45 రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆ పసికందును ప్రాణాపాయం లేకుండా రక్షించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ & పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, డా. పరాగ్ డెకాటే వివరించారు.
వివరాల్లోకి వెళితే..ఛత్తీస్గఢ్, రాయపూర్కు చెందిన తొమ్మిది నెలల శిశువు మెుదటగా జలుబు, దగ్గుతో ఆస్పత్రిలో చేరింది. అనంతరం కొద్ది రోజులకో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన అడెనో వైరస్ కారణంగా వచ్చే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (అడెనోవైరల్ న్యూమోనియా), శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది.
శిశువు పరిస్థితి అత్యవసరంగా మారడంతో కిమ్స్ కడల్స్ నియోనేటల్, పీడియాట్రిక్ ట్రాన్స్పోర్ట్ బృందం హుటాహుటీన రాయపూర్కు చేరుకుంది. అక్కడ శిశువును చికిత్సను అందించి వెంటిలేటర్పై ఉంచి విమానశాఖ సమన్వయంతో సురక్షితంగా హైదరాబాద్కు ఎయిర్లిఫ్ట్ చేశారు.
కిమ్స్ కడల్స్ కొండాపూర్ లో పీడియాట్రిక్ ఐసీయూ చేర్చిన అనంతరం శిశువుకు తీవ్రమైన ఎఆర్డీఎస్ తో పాటు న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరడం) ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఎఫ్ఓవీ, (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి చికిత్సలు చేసినప్పటికీ శ్వాసలో మెరుగుదల కనిపించలేదు. దీంతో పరిస్థితి విషమంగా మారడంతో కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్స మరియు పీడియాట్రిక్ ఐసీయూ బృందాలు కలిసి విఏ ఎక్మో చికిత్స ప్రారంభించాం. ఈ యంత్రం గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి ఆక్సిజన్ అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తుంది.
శిశువు 25 రోజులపాటు ఎక్మోపై ఉండగా, వైద్య బృందం అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. అధిక వైరల్ లోడ్, ఇతర ఇన్ఫెక్షన్లు, గాలి లీకులు, రక్తస్రావం, రక్తపోటు మార్పులు వంటి సమస్యలను విజయవంతంగా చికిత్సను అందించాం.తదుపరి శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో ఎక్మో మరియు వెంటిలేటర్ నుంచి విజయవంతంగా తొలగించాం. మొత్తం 45 రోజుల చికిత్స అనంతరం శిశువును పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేశారు.
ఈ విజయవంతమైన చికిత్సలో పీడియాట్రిక్ ఐసీయూ వైద్యులు డా. కళ్యాణ్ కె, డా. అవినాష్ రెడ్డి పి, డా. వినోద్ కుమార్, డా. మాధురి కె కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్; ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డా. రవి తేజ పాల్గొన్నారు. “సమయానికి సరైన చికిత్స అందడం ఎంత ముఖ్యమో ఈ కేసు నిరూపించింది. ఎక్మో వంటి ఆధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడటంలో కీలకం. వెంటిలేటర్పై ఉన్న శిశువును ఎయిర్లిఫ్ట్ చేసి, దీర్ఘకాలం ఈసీఎంఓపై నిర్వహించడం అనేది నైపుణ్యం కలిగిన వైద్య బృందం వల్లే సాధ్యమైంది” అని డా.పరాగ్ ఈ సందర్భంగా వివరించారు.


