అనంతపురం: తాడిపత్రి బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. ఏడేళ్ల బావమరిదిని హేమచంద్రను బావ సర్వేష్ ప్రాణం తీసినట్లు పోలీసులు గుర్తించారు.
యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో బాలుడిని సర్వేష్ కిడ్నాప్ చేశాడు. అయితే, స్కూల్ నుంచి ఇంటి రావాల్సిన హేమచంద్ర ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడి అక్క భర్త సర్వేష్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని సర్వేష్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బు కోసం నిందితుడు సర్వేష్ తన బావమరిదిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా, నిర్జీవంగా పడి ఉన్న హేమచంద్ర మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


