దక్షిణ ఢిల్లీలోని ఒక ఫుట్పాత్పై నిద్రిస్తున్న నిరాశ్రయులైన కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ‘‘నాన్నా నన్ను కాపాడు" అంటూ ఈ చిన్నారి చివరి అరుపులు విని తండ్రి ఆ తెల్లటి కారు వెనుక పరిగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ ఆమె చివరి మాటలే నేరస్తుడిని పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులకు సహాయపడ్డాయి..కానీ విగతజీవిగా మారిన తమ చిన్నారిని చూసి తల్లతండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎక్కువగా క్యాబ్ సేవలను వాడుకునే వినియోగ దారులు గుండెల్లో గుబులు పుట్టించే ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని ఒక ఫుట్పాత్పై బాలిక తన తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులతో కలిసి నిద్రిస్తోంది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో 'బబ్లూ' అనే యాప్-ఆధారిత క్యాబ్ డ్రైవర్, మద్యం సేవించి, బుకింగ్ కోసం వేచి చూస్తూ అక్కడ కారు ఆపాడు. నిద్రిస్తున్న చిన్నారిని గమనించి, ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమెను కిడ్నాప్ చేశాడు.ఆ బాలికను కారులోకి లాగుతున్నప్పుడు పాపా నన్ను కాపాడు అంటూ శక్తి కొద్దీ అరిచింది. బాలిక అరుపులకు తండ్రి మేల్కొని ఒక కర్ర తీసుకొని కారు వెనుక పరిగెత్తినా ఫలితం లేకపోయింది. నిస్సహాయంగా మిగిలి పోయిన ఆ తండ్రి తక్షనమే పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)కి సమాచారం అందించారు.
నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే?
పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా కారును గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో రైడ్ బుకింగ్ వివరాలను అందించాలని యాప్ సంస్థలను కోరారు. సీసీటీవీ రూట్ మ్యాప్, జీపీఎస్ (GPS), నిందితుడి మొబైల్ లొకేషన్ ఆధారంగా పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో కారును ట్రాక్ చేశారు. కేవలం నాలుగు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
నేర అంగీకారం
పోలీసుల విచారణలో నిందితుడు బబ్లూ తన నేరాన్ని అంగీకరించాడు. బాలికను కిడ్నాప్ చేసిన తర్వాత 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డుకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి, బాలికను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, స్కార్ఫ్తో గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని అక్కడే వదిలేసినట్టు ఒప్పుకున్నాడు.
ఎవరీ బబ్లూ
బిహార్కు చెందిన బబ్లూకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంత అమానుషానికి ఒడిగట్టిన తర్వాత కూడా అతడు ఏమీ ఎరగనట్లు సాధారణంగా ప్రవర్తించాడు. హత్యఅనంతరం గురుగ్రామ్ నుండి పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురికి ఒక ప్యాసింజర్ను కూడా డ్రాప్ చేశాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి భయం లేదా తేడా కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలోనే ఐదు దాడి, గొడవలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

ఎన్కౌంటర్లో నిందితుడికి గాయం
మంగళవారం పోలీసులు నిందితుడు బబ్లూను క్రైమ్ సీన్ (ఘటనా స్థలం) పరిశీలనకు తీసుకెళ్లినప్పుడు, అతడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్బంగా జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని డ్రైవర్గా ఎలా నియమించుకున్నారనే అంశంపై సంబంధిత యాప్-ఆధారిత టాక్సీ సేవల సంస్థకు నోటీసులు జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు.


