మోనోజిత్‌ మామూలోడు కాదు.. లా కాలేజీలో ఇన్ని జరిగాయా? | Kolkata law student And Monojit Mishra Story Details | Sakshi
Sakshi News home page

మోనోజిత్‌ మామూలోడు కాదు.. లా కాలేజీలో ఇన్ని జరిగాయా?

Jul 2 2025 7:18 AM | Updated on Jul 2 2025 7:23 AM

Kolkata law student And Monojit Mishra Story Details

కోల్‌కతా లా కాలేజీలో గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో  ప్రధాన నిందితుడిపై మరో యువతి ఆరోపణ

అతడికి ఎమ్మెల్యే అశోక్‌ అండ ఉందని వెల్లడి  

కోల్‌కతా: సౌత్‌ కోల్‌కత్తా లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా గతంలో తనపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడని మరో విద్యార్థిని తెలిపింది. రెండేళ్ల క్రితం కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.

కాగా, అతడికి రాజకీయ పలుకుబడి, ముఖ్యంగా కాలేజీ బోర్డు అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ కుమార్‌ దేబ్‌ అండ ఉందని వివరించింది. బయటకు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని తల్లిదండ్రులను, సోదరిని చంపేస్తానంటూ అతడు బెదిరించాడని తెలిపింది. భయపడి ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్లు తెలిపింది. తన మాదిరిగా మోనోజిత్‌ సుమారు 15 మంది విద్యార్థినులను వేధించాడని ఆరోపించింది. మోనోజిత్‌పై కొందరు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపింది.

ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం మోనోజిత్‌ పోలీసు అధికారిపై దాడి చేయడంతోపాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తాజాగా వెల్లడైంది. కస్బా ప్రాంతంలోని లా కాలేజీకి సమీపంలో హెచ్‌డీఎఫ్‌సీ కియోస్క్‌ వద్ద ఏప్రిల్‌ 13న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూన్‌ 28వ తేదీన లా కాలేజీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్‌ను కాంట్రాక్టు ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. అదేవిధంగా, ఇద్దరు సహ నిందితుడు ప్రమిత్‌ ముఖర్జీ, జయీబ్‌ అహ్మద్‌లను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే అశోక్‌ కుమార్‌ దేబ్‌ సారథ్యంలో జరిగిన కాలేజీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరు ముగ్గురూ పోలీస్‌ కస్టడీలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో నిందితులపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థులు జైబ్‌ అహ్మద్, ప్రమిత్‌ ముఖర్జీలను కళాశాల నుంచి బహిష్కరించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ కుమార్‌ నేతృత్వంలోని సౌత్‌ కోల్‌కతా లా కాలేజీ పాలక మండలి మంగళవారం వెల్లడించింది. కేసులో ప్రధాన నిందితుడు, లెక్చరర్‌గా పనిచేస్తున్న మోనోజిత్‌ మిశ్ర (31) కాంట్రాక్టును తక్షణమే రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే క్రిమినల్‌ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసును రద్దు చేయమని కోరుతూ బార్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు బాధితురాలు కాలేజీకి ఒంటరిగా వెళ్లడం వల్లే అత్యాచారం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎమ్మెల్యే మాదన్‌ మిత్రా బేషరతుగా క్షమాపణలు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement