కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్‌ మీడియాలో చర్చ | Kolkata incident victim sculpture at RG Kar receives backlash | Sakshi
Sakshi News home page

కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్‌ మీడియాలో చర్చ

Oct 3 2024 10:36 AM | Updated on Oct 3 2024 12:53 PM

Kolkata incident victim sculpture at RG Kar receives backlash

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో  జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా బాధితురాలికి సంబంధించిన విగ్రహం ఆవిష్కరణపై సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హత్యాచార సమయంలో ఆమె అనుభవించిన బాధను ప్రతిబింబించేలా విగ్రహాన్ని  అసిత్ సైన్‌ అనే శిల్పి రూపొందించటం గమనార్హం.  ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్‌ ది అవర్‌’గా నామకరణం చేశారు. బాధితురాలి విగ్రహాన్ని ప్రిన్సిపల్‌ ఆఫీసుకు సమీపంలోని పీజీబీ గార్డెన్‌ ఎదుట  ఆవిష్కరించారు.

 

‘‘బాధితురాలి విగ్రహం ఆవిష్కరించటం చాలా భావోద్వేగంతో కూడుకున్న విషయం. ఆమె మా సహోద్యోగి. మేము ఆమె కోసం పోరాడుతున్నాం. ఆమె మన హృదయంలో ఉంది. విగ్రహ ఏర్పాటు ద్వారా ఆమెను ఎవరూ మరచిపోరు’ అని జూనియార్‌ డాక్టర్‌ అన్నారు.‘‘ ఈ విగ్రహం బాధితురాలిది కాదు, ఆమె అనుభవించిన బాధ, హింస, ఆమె కోసం కొనసాగుతున్న నిరసనలకు ప్రతీక’’ అని మరో జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు.

అయితే ఈ విగ్రహం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ.. తయారు చేసిన విధానం అగౌరవంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘‘ అత్యాచార బాధితురాలి ఆధారంగా  ఇలాంటి విగ్రహాన్ని ఎందుకు సృష్టించారు’’, ‘‘ ఇది మంచి ఆలోచన అని ఎవరు భావించారు? దీన్ని ఎవరు ఆమోదించారు?’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ‘‘ అగౌరవ పరిచేవిధంగా ఏం లేదు. కొందరు భారతీయ స్త్రీలను కూడా గర్వంగా గుర్తుంచుకోలేరు’’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై నిర్ణయాత్మకంగా వ్యవహరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని జూనియర్‌ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు.

చదవండి: కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే

 

Advertisement
 
Advertisement
Advertisement