
ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఎంతబడితే అంత బ్యాగేజీ తీసుకెళ్లడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఎందుకంటే పరిమిత స్థాయిలోనే బ్యాగేజీని అనుమతించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. విమానాశ్రయాలలో మాదిరిగానే, ఇప్పుడు ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీని తూకం వేయనున్నట్టు ప్రకటించింది. నిర్దేశించిన పరిమితికి మించి ఎక్కువ లగేజీ ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కేముందే తమ బ్యాగేజీ ఎంతుందో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రిజర్వేషన్ టికెట్తో దూర ప్రయాణాలు చేసే వారు అధికంగా బ్యాగేజీ తీసుకెళుతుంటారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వలస కూలీలు కూడా ఎక్కువ సామాన్లతో రైలు ఎక్కుతుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బ్యాగేజీని పరిమితం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎయిర్పోర్టుల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లతో లగేజీ (Luggage) తూకం వేసేందుకు ఏర్పాట్లు చేసింది.
బరువుతో పాటు సైజు కూడా..
బ్యాగేజీ బరువు మాత్రమే కాకుండా పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. బ్యాగేజీ చాలా పెద్దదిగా ఉండి, కోచ్ లోపల అదనపు స్థలాన్ని ఆక్రమించేట్టు ఉంటే.. ప్రయాణికుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంటే బ్యాగేజీ బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ సైజు పెద్దగా ఉంటే మాత్రం ఫైన్ (Fine) తప్పదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రయాగ్రాజ్ నార్త్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాన్షు శుక్లా మీడియాతో చెప్పారు.
ఫస్ట్ అక్కడ నుంచే..
ప్రయాగ్రాజ్ డివిజన్లోని కీలక స్టేషన్ల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించాలని నార్త్ సెంట్రల్ రైల్వే (North Central Railway) నిర్ణయించింది. వీటిలో ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ ఛోకి, సుబేదార్గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్పురి, ఎటావా స్టేషన్లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ బ్యాగుల బరువు చూసుకోవాలి. బ్యాగేజీ బరువు తక్కువగా ఉన్నా పరిమాణం(సైజు) పెద్దగా ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్టంగా 70 కిలోలు..
రిజర్వేషన్ టికెట్ల ఆధారంగా బ్యాగేజీ పరిమితిని రైల్వే శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల సామానుతో మాత్రమే రైలులో ప్రయాణించగలరు. కనిష్టంగా 35 కిలోల వరకు అనుమతిస్తారు. ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. సెకండ్ ఏసీ 50 కిలోలు, థర్డ్ ఏసీ- స్లీపర్ క్లాస్ 40 కిలోలు.. జనరల్/సెకండ్ సిట్టింగ్ ప్యాసింజర్లకు 35 కిలోలు వరకు బ్యాగేజీ అనుమతిస్తారు. పరిమితి కంటే 10 కిలోల వరకు ఎక్కువ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. దీనికి మించి లగేజీ ఉన్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ.

అధికారులు ఏమంటున్నారు?
రైళ్లల్లో ప్రయాణించేవారిలో చాలా మంది అధిక సామాను తీసుకెళుతుంటారు. దీనివల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు భద్రతకు విఘాతం కలుగుతుంది. ప్రయాణికులకు పటిష్ట భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు లగేజీని నియంత్రించాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీని మెరుగ్గా నియంత్రించడానికి ఈ చర్య దోహదపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక నుంచి ట్రైన్ జర్నీ (Train Journey) చేసేవారందరూ బ్యాగేజీ బరువును చెక్ చేసుకోవాల్సిందే.
చదవండి: రైలు టికెట్లు ఈజీగా బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వచ్చేస్తోంది