
డబ్బులు పెట్టి సేవలు పొందే వినియోగదారులకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. మొహమాటానికో.. అనవసరమైన గొడవలు ఎందుకనో చాలామంది చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి గప్చుప్గా ఉంటారు. కానీ, ఇక్కడో టీచరమ్మ అలా మౌనంగా ఉండిపోలేదు. తన హక్కుల గురించి తెలుసు కాబట్టి గట్టిగా నిలదీసింది. తనకు ఎదురైన ఇబ్బందిపై ఏకంగా పోరాటం చేసి ఓ పెట్రోల్ బంక్ ఓనర్కు గుణపాఠం చెప్పింది.
పతనంతిట్ట(Pathanamthitta) జిల్లా వినియోగదారుల ఫోరం తాజాగా ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఓ మహిళను టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోకుండా అడ్డుకున్న పెట్రోల్ బంక్కు రూ.1,50,000 జరిమానా విధించింది. పైగా ఆమె కోర్టు ఖర్చులకు మరో రూ.15 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రమాణాలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. వినియోగదారులకు తాగు నీటిని, స్వచ్ఛమైన బాత్రూంల సేవలను పెట్రోల్ బంకులు అందించాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఆ ఉల్లంఘన జరిగినందుకే జరిమానా విధిస్తున్నట్లు వినియోగదారుల ఫోరం బెంచ్ స్పష్టం చేసిందని ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
ఇబ్బందిపడ్డ జయకుమారి
మాతృభూమి న్యూస్ కథనం ప్రకారం.. పతనంతిట్టకు చెందిన జయకుమారి(Jayakumari) ఓ టీచర్. 2024 మే 8న రాత్రి 11 గంటల సమయంలో ఆమె తన కారులో వెళ్తున్నారు. కోజికోడ్ జిల్లా పయ్యోలిలోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు. అయితే అత్యవసరంగా ఆమె అక్కడి టాయిలెట్ సౌకర్యం వినియోగించుకోవాలనుకున్నారు. కానీ, దానికి తాళం వేసి ఉంది. దానిని తెరవాలని ఆమె సిబ్బందిని కోరగా.. అది రిపేర్లో ఉందని, బంక్ ఓనర్ తాళం వేసుకుని వెళ్లిపోయారని సిబ్బంది నిమిషానికో మాట చెప్పారు. దీంతో ఆ బాత్రూంను ఎలాగైనా తెరిపించాలని ఆమె ప్రయత్నించగా.. వాళ్లు ఆమెతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో ఆమె పయ్యోలి పోలీసులను ఆశ్రయించి మరీ బలవంతంగా ఆ బాత్రూంను తెరిపించి వినియోగించుకున్నారు. అయితే తనను చాలా సేపు ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురిచేసిన ఆ బంక్ వాళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆమె అనుకుంది. ఆలస్యం చేయకుండా పతనంతిట్ట జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. ఈ క్రమంలో పది నెలల విచారణ తర్వాత ఆమెకు పరిహారం చెల్లించాలని బంక్ ఓనర్ను ఫోరం ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఫిల్లింగ్ స్టేషన్లలో మంచి నీరు, బాత్రూం సౌకర్యాలతో పాటు టైర్లలో ఉచితంగా గాలి నింపడం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలేవీ పాటించకపోతే.. వినియోగదారుడు జయకుమారి టీచర్లానే కన్జూమర్ ఫోరమ్ను ఆశ్రయించవచ్చు.