కొలీజియంలోకి జస్టిస్‌ నాగరత్న  | Justice BV Nagarathna to enter Supreme Court Collegium | Sakshi
Sakshi News home page

కొలీజియంలోకి జస్టిస్‌ నాగరత్న 

May 25 2025 2:42 AM | Updated on May 25 2025 2:42 AM

Justice BV Nagarathna to enter Supreme Court Collegium

న్యూఢిల్లీ: మరో రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి రికార్డ్‌ సృష్టించబోతున్న జస్టిస్‌ బీవీ నాగరత్న నేడు సుప్రీంకోర్టు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారు. ఇంతకాలం కొలీజియంలో సభ్యునిగా ఉన్న సుప్రీంకోర్టు మరో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా శుక్రవారం పదవీవిమరణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఐదో సీనియర్‌ మోస్ట్‌ జడ్జి అయిన జస్టిస్‌ నాగరత్న మే 25వ తేదీ నుంచి అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియంలో కొనసాగనున్నారు. 2027 అక్టోబర్‌ 29వ తేదీదాకా ఆమె ఈ కొలీజియంలో కొనసాగుతారు. ఈలోపు అంటే 2027 సెపె్టంబర్‌ 23వ తేదీన అత్యంత సీనియర్‌ మోస్ట్‌ జడ్జి అర్హతతో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈమె 1989లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజేఐ జస్టిస్‌ ఇ. సీతారామయ్య వెంకటరామయ్య కుమార్తె. జస్టిస్‌ నాగరత్న చేరికతో కొలీజియం సభ్యుల సంఖ్య ఐదుకు పెరగనుంది. 

ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి ఇందులో సభ్యులుగా ఉన్నారు. సోమవారం సీజేఐ కొలీజియంను సమావేశపరిచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఖాళీలపై వివరాలు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా రిటైర్‌ అయ్యాక సుప్రీంకోర్టులో మూడు జడ్జీ పోస్టులు ఖాళీ అయ్యాయి. 1993లో కొత్తగా మనుగడలోకి వచ్చిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ద్వారానే సుప్రీంకోర్టు, 25 హైకోర్టులకు జడ్జీల ఎంపిక, బదిలీ, పదోన్నతి ప్రక్రియలు కొనసాగుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement