సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకు దిగాడు. “మా ఉద్యమం ఆగదు.. పోరాటం కొనసాగుతుంది” అంటూ ఆయన ప్రకటించారు.
నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20వ తేదీ నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శనివారం నాటికి 21వ రోజుకు చేరుకుంది.
దీక్ష కొనసాగిస్తున్న వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై CJP నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు.
‘ఉద్యమం ఆగదు’.. దీక్షకు దిగిన అభిజిత్
వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా ఉద్యమం ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరతాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం’’ అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, నీట్ వివాదంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశాడు.
పోలీసులపై ఆరోపణలు
ఇంతకుముందు కూడా అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. “నన్ను కొట్టారు.. సోనం సర్ను బలవంతంగా తీసుకెళ్లారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించలేదు.
పోలీసుల వివరణ
మరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వాంగ్చుక్ ప్రస్తుతం స్పృహలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
జంతర్ మంతర్ వద్ద..
వాంగ్చుక్ ఆస్పత్రికి తరలింపు అనంతరం నిరసనకారులను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. దీంతో కొంతసేపు అక్కడ వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నీట్ పరీక్షలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై న్యాయ విచారణ జరపాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష, పోలీసుల చర్య, అభిజిత్ దీప్కే తాజా నిరసనతో జంతర్ మంతర్ పరిణామాలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.


