న్యూఢిల్లీ: భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ను దాటి భారత్ దిశగా సాగుతోంది.
ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది.


