13 మందిని అరెస్ట్ చేసిన ఘజియాబాద్ పోలీసులు
నవజాత శిశువును ఏపీలో విక్రయించేందుకు ప్రయత్నం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలోని ఘజియాబాద్లో పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని నవజాత శిశువులను కొనుగోలు చేయడం లేదా అపహరించడం వంటి నేరాలకు పాల్పడుతూ వారిని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఈ అక్రమ దందా వ్యవహారంలో 13 మందిని ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అపహరణకు గురైన 11 రోజుల పసికందును ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజు, దీప్తి అనే దంపతులకు అమ్మేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఈ ముఠాను ఛేదించినట్లు ట్రోనిక సిటీ ఎస్హెచ్ఓ మనోజ్కుమార్ ‘సాక్షి’కి తెలియజేశారు. ఈ పాప జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మనసు మార్చుకుని విక్రయించేందుకు నిరాకరించారు.
దీంతో ముఠా సభ్యురాలు పూజా అనే మహిళ మే 26న ఆ దంపతులు ఇంట్లో నుంచి 11 రోజుల పసికందును అపహరించింది. అనంతరం శిశువును మరో నిందితుడు మనోజ్కు అప్పగించింది. స్థానిక నిఘా, సీసీటీవీ ఫుటేజ్, విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ట్రోనిక సిటీ పోలీసులు శిశువును రక్షించి పూజా, మనోజ్తో పాటు మరో 11 మందిని అరెస్టు చేశారు. వీరంతా ప్రధాన నిందితురాలు తరన్నుమ్, మరో సభ్యుడు ప్రదీప్ ద్వారా ఈ ముఠాలో చేరినట్లు విచారణలో అంగీకరించారు.
కొనుగోలు చేసిన లేదా అపహరించిన నవజాత శిశువులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విక్రయించేవారు. త్వరలో సంతానం కలగబోయే పేద కుటుంబాలను సైతం ముఠా సభ్యులు టార్గెట్ చేసుకుని వారి నుంచి నవజాతి శిశువులను చేజిక్కించుకునేందుకు కుతంత్రాలు పన్నడం గమనార్హం. ముఠా సభ్యులు లక్ష్యంగా పెట్టుకున్న పేద కుటుంబాల వివరాలను ముఠా సభ్యులు వాట్సాప్ ద్వారా పరస్పరం పంచుకునేవారు. పని పూర్తయిన వెంటనే ఆధారాలు లేకుండా ఉండేందుకు సందేశాలను తొలగించేవారు. నిందితులు ఎక్కడెక్కడ ఎంతమందిని విక్రయించారు అనే వివరాలుసహా ఈ అక్రమ రవాణాపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు మనోజ్కుమార్ తెలిపారు.
నకిలీ నోట్లతోనూ మోసం..
శిశువులను కొనుగోలుచేసే సమయంలో ఈ ముఠా నకిలీ నోట్ల దారుణానికి కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శిశువులను తీసుకునే సమయంలో అసలు నోట్ల మధ్య నకిలీ కరెన్సీ నోట్లను కలిపి తల్లిదండ్రులకు ఇచ్చేవారు. తాము మోసపోయామని గ్రహించేలోపే శిశువుతో పరారయ్యేవారు. డబ్బు తీసుకున్నామనే భయంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడేవారని అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2,500 విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.


