
కోల్కతా: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలీ(22)కి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన కామెంట్లు చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు గతవారం హరియాణాలోని గురుగ్రామ్లో ఉండగా అరెస్ట్ చేశారు. లా స్టూడెంట్ అయిన శర్మిష్ట ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్లోని ఓ వర్గం నటులు మౌనంగా ఉన్నారంటూ మే 7న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఆన్లైన్లో వైరలయ్యింది.
తీవ్రమైన కామెంట్లు రావడంతో మరునాడే మే 8న వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. బెదిరింపులు రావడంతో కుటుంబంతో సహా వేరే చోటుకు మకాం మార్చింది. అయినప్పటికీ, ఆమె తన వీడియో ద్వారా మత విద్వేషాలను ప్రేరేపించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. దీంతో మే 30వ తేదీన గురుగ్రామ్లో అరెస్ట్ చేసిన పోలీసులు కోల్కతాకు తరలించారు.
బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనపై జస్టిస్ రాజా బసు చౌదరి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు వింది. గురువారం తీర్పు విడుదల చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. అదేవిధంగా, పనోలీకి తగు భద్రత కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.