దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.
ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.
పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది.


