భారత్‌పై విషం చిమ్మిన పాక్‌ | india slams pakistan asif ali zardari masjid remark abysmal human rights | Sakshi
Sakshi News home page

భారత్‌పై విషం చిమ్మిన పాక్‌

Jun 21 2026 11:28 AM | Updated on Jun 21 2026 4:27 PM

india slams pakistan asif ali zardari masjid remark abysmal human rights

ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే  హక్కు ఇస్లామాబాద్‌కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.

ఇటీవల పాకిస్థాన్‌ అధ్యక్షుడు భారత్‌పై విషం చిమ్మారు. ఎక్స్‌ వేదికగా భారత్‌ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. 

తాజాగా దీనికి భారత్‌ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్‌కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.

అయితే పాకిస్థాన్‌లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. 

రాజకీయ ప్రేరేపిత దాడి

జర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.

వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్‌కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement