
2030 నాటికి సృష్టించాల్సిన అవసరం ఉంది: గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు.
2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు.