దిగుమతులు బంద్‌ | India decides to completely ban imports from Pakistan | Sakshi
Sakshi News home page

దిగుమతులు బంద్‌

May 4 2025 1:02 AM | Updated on May 4 2025 1:02 AM

India decides to completely ban imports from Pakistan

పోస్టల్‌ సేవలు కూడా 

పాక్‌కు మరిన్ని షాక్‌లు 

దాయాది నౌకలకు నో ఎంట్రీ  

ఐఎంఎఫ్‌ రుణాన్ని అడ్డుకుంటోంది 

భారత్‌ చర్యలపై పాక్‌ ఆక్రోశం 

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్‌ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. 

జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్‌ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్‌ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. 

అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్‌ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్‌ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్‌ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్‌ రుణానికి భారత్‌ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. 

దిగుమతులు అంతంతే 
పాక్‌ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్‌ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్‌ ఉత్పత్తులపై భారత్‌ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్‌ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. 

తొమ్మిదో రోజూ కాల్పులు 
సరిహద్దుల వెంబడి పాక్‌ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. 

రెచ్చగొట్టేలా పాక్‌ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్‌ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్‌ సైన్యం శనివారం ప్రకటించుకుంది. 

పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్‌ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 

‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం 
పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలు 
ఇస్లామాబాద్‌: సింధూ నదీ వ్యవస్థపై భారత్‌ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement