
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. బంగ్లాదేశ్తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.
దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ(ఏడీడీ) విధించింది.
ఈ చర్య బంగ్లాదేశ్ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి.