జనగణన నోటిఫికేషన్‌ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే.. | Government has Formally Announced that the 16th Census of India | Sakshi
Sakshi News home page

జనగణన నోటిఫికేషన్‌ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..

Jun 16 2025 12:21 PM | Updated on Jun 16 2025 1:54 PM

Government has Formally Announced that the 16th Census of India

న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది.  దీనిలో భాగంగా ఈరోజు(జూన్‌ 16) జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది(2026) అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. ఆదివారం జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తదనంతరం జనాభా లెక్కలను గణించే తేదీలను ఖరారు చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే  కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తరువాత జరుగుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న జనగనణ పలు కీలక అంశాలను వెల్లడించనుంది. 1948 జనాభా గణన చట్టం ప్రకారం దీనిని నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది.

జనాభా గణన రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు.  మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన (2026) ఉంటుంది. దీనిలో  జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్‌ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు.

దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్‌గా  ఉండనుంది. ఇందుకోసం 16 భాషలలో కూడిన మొబైల్ యాప్‌లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు,  ఎస్టీలు మాత్రమే కాకుండా  ఓబీసీలు సహా అన్ని కుల సమూహాలను కవర్‌ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి: అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement