వారం క్రితమే వివాహం.. గేమింగ్‌ జోన్‌లో అగ్నికి ఆహుతై.. | Gaming Zone Fire Newly Married Couple Killed | Sakshi
Sakshi News home page

వారం క్రితమే వివాహం.. గేమింగ్‌ జోన్‌లో అగ్నికి ఆహుతై..

May 27 2024 1:49 PM | Updated on May 27 2024 1:49 PM

Gaming Zone Fire Newly Married Couple Killed

గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటన  పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.  ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి  ఉన్నారు. ఈ జంటకు వారం  క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్‌కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు.    

24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు.  ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్‌కోట్‌కు వచ్చాడు.  గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు  గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలకు తరలించారు.

ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్‌పీ గేమింగ్‌ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement