
260 మంది చనిపోయారన్న అధికారులు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు పూర్తయింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా శనివారం 260వ మృతుడిని గుర్తించి, సంబంధీకులకు మృతదేహాన్ని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మొత్తం 260 మంది చనిపోయినట్లు తేలిందన్నారు. జూన్ 12వ తేదీన జరిగిన దుర్ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మొత్తం 241 మంది చనిపోయారు.
విమానం కూలిన ప్రాంతంలో మరికొందరు చనిపోయారు. దీంతో, 270 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. అయితే, మృతదేహాలను బట్టి విమానంలోని 241 మంది, నేలపైనున్న 19 మంది కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి శనివారం చెప్పారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.