ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా? | Ahmedabad Air India Crash: One Year On Cause Still Unclear | Sakshi
Sakshi News home page

ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?

Jun 12 2026 9:05 AM | Updated on Jun 12 2026 10:06 AM

Ahmedabad Air India Crash: One Year On Cause Still Unclear

న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. 

ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.

ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్‌ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్‌ రిపోర్ట్‌) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.

గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే బోయింగ్‌ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌లు దాదాపు ఒకేసారి "రన్‌(RUN)" స్థితి నుంచి "కటాఫ్‌(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.

అయితే ఆ స్విచ్‌లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement