త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి

Published Wed, Aug 9 2023 5:20 AM

Fill the vacancies in the three forces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1.55 లక్షల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఇంటర్‌ సర్విసెస్‌ ఆర్గనైజేషన్స్‌ (కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్‌) బిల్లు–2023పై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆర్మీలో 1.36 లక్షలు, నౌకాదళంలో 12,500, వైమానికదళంలో ఏడువేల ఖాళీలున్నాయని చెప్పారు.

రక్షణ రంగంపై అమెరికా, చైనా ఏటా తమ జీడీపీలో 3.38 శాతం (801 బిలియన్‌ డాలర్లు), 1.74 శాతం (293 బిలియన్‌ డాలర్లు) ఖర్చుచేస్తుంటే భారత్‌ కేవలం 77 బిలియన్‌  డాలర్లు మాత్రమే ఖర్చుచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై చేస్తున్న వ్యయం క్రమంగా తగ్గిపోతోందని చెప్పారు. ఈ బిల్లుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా మాట్లాడారు.  

ఏపీలో ఇంటి ముంగిటే ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు  
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటే వైద్యసేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతీప్రవీణ్‌ పవార్‌ చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నెలకొలి్పన వెల్‌నెస్‌ సెంటర్లకు ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని, నెలలో రెండుసార్లు వెల్‌నెస్‌ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు.

రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ స్కీంను కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్యశ్రీ యోజన పథకంతో జోడించి అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కీం కింద అర్హులైన మొత్తం 1.41 కోట్ల కుటుంబాల్లో 61.47 లక్షల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో హెల్త్‌ కవరేజ్‌ అందుతుండగా మిగిలిన 80.23 లక్షల కుటుంబాలకు కవరేజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తోందని చెప్పారు.     

హైవేలతో మేజర్‌ పోర్టుల అనుసంధానం  
ఏపీ సహా దేశంలోని మేజర్‌ పోర్టులన్నింటికీ జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ ఉందని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2022–23లో ఏపీలోని పోర్టులు 133.32 మిలి­యన్‌ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పా­రు. ఏపీలోని నాలుగు పోర్టులు బొగ్గు, నాలుగు పోర్టులు ఎరువులు, ఒక పోర్టు సిమెంటు, రెండు పోర్టులు పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు తెలిపారు.  

ఏపీలో పవన విద్యుత్తు సామర్థ్యం  
ఆంధ్రప్రదేశ్‌లో భూతలానికి 120 మీటర్ల ఎత్తులో 74.90 గిగావాట్లు, 150 మీటర్ల ఎత్తులో 123.33 గిగావాట్ల పవన విద్యుత్తు సామర్థ్యం ఉందని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు జవాబిచ్చారు.  

4,552.12 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం 
ఆంధ్రప్రదేశ్‌లో 4,552.12 మెగావాట్ల సౌరవిద్యుత్తు సామర్థ్యం ఉన్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌.. వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్‌నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2022–23లో ఏపీలో 8,140.72 మిలియన్‌ యూనిట్లు సౌరవిద్యుత్తు ఉత్పత్తి 
అయినట్లు తెలిపారు.  

ఏపీలో నాలుగు సోలార్‌పార్కులు 
ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సోలార్, అ్రల్టామెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పథకంలో భాగంగా నాలుగుచోట్ల సోలార్‌పార్కులు ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 1,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం సోలార్‌ పార్కుకు రూ.244.80 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కర్నూలు సోలార్‌ పార్కుకు రూ.200.25 కోట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం–2 సోలార్‌ పార్కుకు రూ.91.24 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కడప సోలార్‌ పార్కుకు రూ.54.25 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.

అనంతపురం, కర్నూలు సోలార్‌ పార్కులు పూర్తిస్థాయిలోను, అనంతపురం–2 పార్కులో 400 మెగావాట్లు, కడప సోలార్‌ పార్కులో 250 మెగావాట్ల సామర్థ్యం అమల్లో ఉన్నట్లు చెప్పారు. 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగిరి సోలార్‌ పార్కు టెండరింగ్‌ దశలో ఉందని తెలిపారు.  

ఏపీలో 6,68,833 సికిల్‌సెల్‌ వ్యాధి స్క్రీనింగ్‌ టెస్ట్‌ల లక్ష్యం  
ఆంధ్రప్రదేశ్‌లో 2023–24లో 6,68,833 సికిల్‌సెల్‌ వ్యాధి స్క్రినింగ్‌ టెస్ట్‌లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్‌.పి.సింగ్‌ భగేల్‌ తెలిపారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కళ్లు, ఎముకలు, మెదడు అవయవాలను ప్రభావితం చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.  

విశాఖ ఉక్కు భూమిపై ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్‌ ఆఫ్‌ అటార్నీ 
విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్‌మెంట్‌ లావాదేవీకి రూపు­రేఖలు ఇంకా ఖరారు కాలేదని కేంద్ర ఆరి్థకశాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కారడ్‌ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన 19,703.10 ఎకరాల భూమిని కేంద్ర ఉక్కుశాఖ పేరిట సేకరించారని చెప్పారు. ఈ భూమిని వినియోగించుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఉందని తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement