
సక్సెస్ఫుల్ సీఎంను కోల్పోయిన గుజరాత్
రూపానీ మరణంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన సంతాపాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది.
విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ
ప్రస్తుతం మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్లో చేరారు.
భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ పనిచేశారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు.
2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు ఛైర్మన్గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు.

బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.
ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్కోట్ వెస్ట్లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.
లక్కీనంబర్ 1206 నాడే...
1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు.